‘విపత్తులు ప్రకృతికి సంబంధించినవే కాదు... మానవులు చేసేవీ ఉంటాయి. 2024 ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో గత ప్రభుత్వం మళ్లీ వచ్చి ఉంటే మరింత విధ్వంసం జరిగేది. అలా జరగకుండా ఎన్డీయేగా మేమంతా కలిసి పోరాడి.. గత ప్రభుత్వం అనే విపత్తు నుంచి ప్రజల్ని కాపాడగలిగాం. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో హోంమంత్రి అమిత్షా సూచనలతో చంద్రబాబు నాయకత్వంలో పనిచేసి రాష్ట్రంలో మరోసారి మానవ నిర్మిత విపత్తు పాలన రాకుండా కాపాడాం. ఇప్పుడు ఎన్ఐడీఎం, ఎన్డీఆర్ఎఫ్ సంస్థలు ప్రారంభం కావడానికి అదే దోహదపడింది’ అని ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ వ్యాఖ్యానించారు.
గన్నవరం మండలం కొండపావులూరులో ఆదివారం నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ‘ఆరు నెలలుగా రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహకారం చాలా గొప్పది. విశాఖ ఉక్కు కర్మాగారానికి నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు. ఎన్ఐడీఎం సదరన్ క్యాంపస్ను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటుచేయడాన్ని స్వాగతిస్తున్నాం. 18 ఏళ్లలో 12,320 రెస్క్యూ ఆపరేషన్లు చేశారంటే ఎన్డీఆర్ఎఫ్ సేవలు ఎంత కీలకమో తెలుస్తుంది. 2020లో విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజి, 2022లో అచ్యుతాపురం అమ్మోనియం గ్యాస్ లీకేజి, ఇటీవల వచ్చిన విజయవాడ వరదల్లో ఎన్డీఆర్ఎఫ్ అందించిన సేవలు మరువలేనివి’ అని పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీ స్థాయిలో విపత్తు నిర్వహణ బృందాలు
‘విపత్తుల నిర్వహణ ఎన్డీఆర్ఎఫ్ పని మాత్రమే కాదు. ఇది అందరి బాధ్యత. పంచాయతీ స్థాయిలోనూ విపత్తు నిర్వహణపై ప్రజలకు ముందస్తు అవగాహన ఉండాలని అమిత్షా సూచించారు. ప్రతి పంచాయతీ పరిధిలో విపత్తు నిర్వహణ బృందాలను తయారుచేస్తాం. వారికి ఎన్డీఆర్ఎఫ్ ప్రతినిధులతో శిక్షణ ఇప్పిస్తాం’ అని వెల్లడించారు.
ఎన్డీఆర్ఎఫ్ ఇక్కడ ఉండడం అతిపెద్ద భరోసా
‘సుదీర్ఘ తీర ప్రాంతమున్న ఆంధ్రప్రదేశ్కి తుపానుల తాకిడి ఎక్కువ. విపత్తుల వేళ ఎన్డీఆర్ఎఫ్ సహకారంతో భారీ నష్టం జరగకుండా అధిగమించొచ్చు. అలాంటి సంస్థ ఇక్కడ ఉండడం అతిపెద్ద భరోసా. విజయవాడలో ఎన్ఐడీఎం, ఎన్డీఆర్ఎఫ్ సంస్థలు ఏర్పాటుకావడం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమల్లో మరో కీలకమైన అడుగు. 2016లో భూమి కేటాయింపు నుంచి ఇప్పుడు ప్రారంభం వరకు ఈ సంస్థలు రాష్ట్రంలో కొలువుదీరడంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు భాగస్వామ్యం ఎక్కువగా ఉంది’ అని తెలిపారు.
.jpeg)
Post A Comment:
0 comments: