ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ (Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ (Mark shankar) సింగపూర్ స్కూల్లో ఏప్రిల్ 8న జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈ ప్రమాదం నుంచి మార్క్ సహా కొంతమంది చిన్నారులను నలుగురు భారతీయ వలస కార్మికులు కాపాడారు. ఇటీవల సింగపూర్ ప్రభుత్వం వారిని సత్కరించింది. తాజాగా వారికి ‘లైఫ్ సేవర్’ అవార్డును ప్రదానం చేసింది. వారి ప్రాణాలు పణంగాపెట్టి పిల్లలను రక్షించినందుకు ఈ అవార్డును ప్రదానం చేసినట్లు సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ పేర్కొంది.
ఈ ప్రమాదంపై కార్మికులు మాట్లాడుతూ.. ‘‘మేము చూసేసరికి గదిలో పిల్లలు భయంతో వణుకుతూ, అరుస్తూ కనిపించారు. మూడో అంతస్తు నుంచి కొందరు పిల్లలు దూకేయాలని చూశారు. మేం వాళ్లతో మాట్లాడి దూకకుండా చూశాం. తర్వాత వారిని కిందకు తీసుకొచ్చాం. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆమెను కాపాడలేకపోయినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాం’’ అని విచారం వ్యక్తంచేశారు.
సింగపూర్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ సమీపంలోని రివర్ వ్యాలీ రోడ్లోని ఓ మూడంతస్తుల భవంతిలో ఈ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 15 మంది పిల్లలు సహా 20 మంది గాయపడ్డారు. ఆ సమయంలో ఈ వలస కార్మికులు అక్కడికి సమీపంలోనే పని చేస్తున్నారు. భవనం నుంచి పిల్లల అరుపులు విని.. మూడో అంతస్తు నుంచి పొగలు రావడం గమనించారు. ఆలస్యం చేయకుండా సహాయక చర్యలకు దిగి.. భవనంలో చిక్కుకున్న పిల్లలను సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు.

Post A Comment:
0 comments: